ఈ మధ్య వచ్చిన అయోధ్య తీర్పుపై చర్చ చేయడానికే చాలా మంది జంకుతున్నారు. ఎందుకంటే మతకల్లోలాలు వస్తాయేమో, ఈ పిచ్చి జనాలు కొట్టుకు చస్తారేమోనని. కానీ అటువంటివేవీ జరగలేదంటే దీని నేపథ్యమే ఓ అబధ్ధపు రంగుటద్దాలలో వుందన్నది స్పష్టమైంది. ఎవడికి వాడు గొప్ప లౌకికవాదిగా, మానవతావాదిగా కొత్త బురఖాలకోసం యాతనపడుతున్నారు. నిజంగా వీళ్ళదంతా నిజమైన దేశాభిమానమా? ఎవడికి వాడు రాజకీయ జిత్తులలో పై చేయి సాధించాలని చూస్తూ ఈ తీర్పుతో న్యాయదేవత కళ్ళను పూర్తిగా తొలగించారన్నది స్పష్టం. ఈ తీర్పు వెలువరించిన వాళ్ళకంటే కాస్తా కల్లు, మాంసం శిక్షగా వేసే కులపెద్దలే నయం కాదా? ఎందుచేతనంటే..
అసలు మీరన్న హిందూ ధర్మం ప్రకారమే యుగాల లెక్కల ప్రాప్తికి ఇప్పటికి రాముడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలైంది. ఒక్కో యుగం అంతమైనప్పుడు మొత్తం నాశనమైందన్నది మీ లెక్కే. అలా అయినప్పుడు అన్ని లక్షల సం.క్రితం నాశనమైన వాటి ఆనవాళ్ళు ఇంకా ఎలా లభ్యమవుతాయి. మొన్నటికి మొన్న వున్న వూళ్ళే ప్రాజెక్టుల పేరుతో నీళ్ళు నింపి నాశనమైన తరువాత వాటి ఆనవాళ్ళు మిగులుతున్నాయా? తుఫానులు, భూకంపాలతో నాశనమైన చోట ఇంకేమి మిగులుతుంది. ఇప్పుడున్న ఈ భారత దేశంలో వున్న అయోధ్య అన్ని లక్షల సం.ల క్రితం నాటి అయోధ్యగా ఎలా నిరూపించగలరు? అనవసరంగా ప్రజల బుఱ ను పాడుచేసి మతం రంగుతో మానవత్వాన్ని మంటగలిపి అసలు సమస్యలనుండి దృష్టి మళ్ళీంచే ఇలాంటి కుయుక్తులు పాలకవర్గాలు ఎన్నైనా చేస్తూనే వుంటాయి.
మరో సందేహం ఏమంటే కేసు అరవై ఏళ్ళ క్రితం నాడు మొదలైంది. మరి ఇది కొనసాగుతున్న కాలంలో అక్కడ బాబ్రీ మసీదు వున్నదే కదా? అది వాడుతున్నారా లేదా అన్నది ముఖ్యంకాదు. ఆ పేరుతో కట్టడం వుంది కదా? దానికింద పరిశోధించి ఆలయాల ఆనవాళ్ళు వున్నాయని తీర్పునిచ్చారంటున్నారు. మరి ఆ కట్టడాన్ని కూలగొట్టించడంలో న్యాయస్థానం పాత్రకూడా వున్నదని ఒప్పుకుంటున్నారా? మరి అది కూలగొట్టబడడం వల్లనే కదా మీ తీర్పునివ్వగలిగారు? అంటే బాబ్రీ మసీదు కూల్చివేత వెనక అలహాబాదు న్యాయస్థానం పాత్రకూడా వుందన్నమాట అన్నది సత్యదూరం కాదు. ఒకరేమో ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారంటారు, ఒకరేమో ఆలయ శిధిలాలు లేవంటారు. అంటే ఎవరిది నిజమైన తీర్పు. అసలు ఈ తీర్పు న్యాయస్థానం వెలువరించిందా లేక మతపెద్దల కూటమిదా? అన్న సందేహం వుంది. తీర్పు శాస్త్రీయ ప్రమాణాలకు దూరమన్నది నిజం కాదా? ఈ న్యాయమూర్తులు ఎవరి మతానికి వాళ్ళు రిప్రజెంట్ చేసినట్లుగా లేదా?
రాముడు కలలోకి వచ్చి చెప్పాడన్న సాకుతో సాధువుల ప్రేరణతో, వైకుంఠానికి చేరి స్వర్గ సుఖాలనుభవించొచ్చు అని చెప్పిన వారి ప్రాపకంతో బాబ్రీ కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాటి బ్రాహ్మణ ప్రధాని. ఇంతకంటే దారుణముంటుందా?
మూడు వాటాలేసి సమన్యాయం పాటించామంటున్నారు. ఇదెలా? హిందు, ముస్లింలకు, నిర్మోహి అఖారాకు మూడు వాటాలన్నారు. ఈ నిర్మోహి అకారా వారు హిందువులు కాదా? అంటే రెండు వాటాలు వీళ్ళకు ఒక వాటా వాళ్ళకు.
అసలు ఈ మసీదులు, మందిరాలు తప్ప జనానికి వేరే పనిలేదనుకుంటారు ఈ బుఱ తక్కువ వెధవలు. జనానికి ఇవేమీ పట్టవని, వాళ్ళ పొట్టకోసం పాడుపడుతూ వుంటారని, ఎవడో ఒకడు కోరి చిచ్చు పెడితే తప్ప వాళ్ళు ఏమీ స్వతహాగా చెడ్డ పనులు చేయరన్నది నేడు నిరూపితమైంది. కాబట్టి ఇకనైనా మందిరాలు, మసీదులు గురించి మాని జనం గోడు పట్టించుకోండి. రాసుకున్న రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నాలు మానుకోండి.
జయహో భారత్..యుగాల గురించిఃhttp://www.indianetzone.com/40/four_yugas.htm